Mar 02,2023 21:54

సమావేశంలో పాల్గొన్న పాలక వర్గ సభ్యులు

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ పాలక వర్గం ఎందుకు అమోదం తెలుపుతారో....ఎందుకు రద్దు చేస్తారో వారికే అర్థం కావడం లేదు. పురపాలక సంఘంలో నూతనంగా నిర్మాణం చేసిన ప్రాంతంలో లక్ష్మినరసింహా స్వామి ఆలయం వెనుక స్వచ్చ్‌భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ కోసం స్థలం కేటాయిస్తు రెండు నెలల క్రితం కౌన్సిల్‌ అమోదం తెలిపింది. దీంతో అధికారులు దానికి సంబందించి రికార్డులు సిద్దం చేసి నిర్మాణం కోసం గుత్తేదారులకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. దీంతో గత వారం కింద కేటాయించిన స్థలంలో మరుగుదోడ్లు నిర్మాణం చేయడానికి భూమి పూజ చేయాడానికి వెళ్లారు. అయితే ఆ ప్రాంత ప్రజలతో పాటు వివిధ పార్టీలకు చెందిన వారు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో ఈ విషయం తీవ్ర వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డిఎన్‌ ఇంద్రజ చాంబర్‌లో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు కలిసి ఈ విషయంపై సమగ్రంగా చర్చించి, గతంలో అమోదం తెలిపిన ప్రాంతంలో మరుగుదోడ్లు నిర్మాణం చేయడాన్ని రద్దు చేస్తు తీర్మానం చేసుకున్నారు. ఈ సమావేశంలో వైస్‌ఛైర్మన్‌ జబివుల్లా, వైసిపి, టిడిపి, బిజెపి కౌన్సిలర్లు పాల్గొన్నారు.