Jul 24,2021 15:44

మంగళగిరి : ఎపి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. 'మినిస్టర్‌ డౌన్‌.. డౌన్‌.. వెల్లంపల్లి రాజీనామా చేయాలి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. గురుపౌర్ణమి సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రానికి శనివారం వెళ్లారు. శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామిని కలిసి ఆశీస్సులు అందుకోవాలని అనుకున్నారు. మంత్రి అక్కడికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న రాజధాని అమరావతి రైతులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించారు. అయితే, మంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్లంపల్లి దేవాదాయ మంత్రి అయ్యాక ఆలయాలపై దాడులు పెరిగాయని, అమరావతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మినిస్టిర్‌ డౌన్‌ డౌన్‌.. వెల్లంపల్లి రాజీనామా చేయాలి' అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మంత్రి వెల్లంపల్లి పోలీసుల రక్షణ నడుమ కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.