ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ మహిళలు ఏదో ఒకవృత్తిలో నైపుణ్యం పెంపొందించుకుని రాణించాలని నాబార్డ్ డిడిఎం అనురాధ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామ్లో 15 రోజులుగా జీవస్త్రం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 30మందికి శారీ రోలింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నాబార్డ్ గ్రామీణ ప్రాంతాల మహిళలకు నైపుణ్యం పెంచి తద్వారా ఉపాధి పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే శారీ రోలింగ్, పట్టు చీరల డ్రై క్లీనింగ్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు సొంతంగా షాపులు నిర్వహించుకోవచ్చన్నారు. అందుకు నాబార్డ్ తగిన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అనంతరం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీవస్త్రం సంస్థ అధ్యక్షురాలు రమీజా, నాబార్డ్ అధికారులు మంజునాథ్ మెప్మా జిల్లా అధ్యక్షురాలు సాయి లీల, రమాదేవి, ధరణి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న నాబార్డ్ డీడీఎం అనురాధ










