Jun 10,2022 07:42

 పాఠశాల విద్యార్థులకు లబ్దిని చేకూర్చటంలో విఫలం * తెలుగు రాష్ట్రాల్లో మెరుగ్గా ఆంధ్రప్రదేశ్‌
* 2021-22 గణాంకాల్లో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ : ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజన పథకం అసలు లక్ష్యాన్ని కొన్ని రాష్ట్రాలు నీరు గారుస్తున్నాయి. విద్యార్థులందరికీ ఉచిత మధ్యాహ్న భోజనం అందించటంలో విఫలమవుతున్నాయి. ఇందులో బిజెపి పాలిత రాష్ట్రం బీహార్‌తో పాటు ఢిల్లీ చెత్త ప్రదర్శనను కనబర్చాయి. తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రా లూ కాస్త వెనకబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ పని తీరు పర్వాలేద నిపించింది. 2021-22 ఏడాదికి గానూ ఆయా రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం అందించిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం మధ్యాహ్న భోజన పథకం (పిఎం-పోషణ్‌) లేదా ఆహార భద్రతా భత్యం (అలవెన్సు) లబ్దిని పాఠశాల చిన్నారులకు చేకూర్చటంలో కొన్ని రాష్ట్రాలు వెనకబడిపోయాయి. ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆయా రాష్ట్రాల సమాచారం, ప్రదర్శనకు సంబంధించిన నివేదిక గతనెల 9న విడుదలైంది.
నితీశ్‌ ప్రభుత్వం విఫలం
నివేదిక ప్రకారం.. బీహార్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల్లో నమోదిత చిన్నారుల సంఖ్య 1.17 కోట్లు. ఇందులో 73.61 లక్షల మందికి (62 శాతం మంది) పథకం కింద అక్కడి ప్రభుత్వం కవర్‌ చేయగలిగింది. 38 శాతం మంది పథకం కింద లబ్ది పొందలేదు.
ప్రాథమికోన్నత తరగతులకు చెందిన చిన్నారుల సంఖ్య 61.90 లక్షలుగా ఉన్నది. వీరిలో 38.84 లక్షల మంది (37 శాతం మందికి) చిన్నారులకే మధ్యాహ్న భోజన పథకాన్ని నితీశ్‌ ప్రభుత్వం అమలు చేయగలిగింది. అంటే, 63 శాతం మంది చిన్నారులకు పథకం కింద ఉచిత భోజనాన్ని అందించలేక దారుణ ప్రదర్శనను కనబర్చింది. బీహార్‌లో కవరేజీ సంఖ్యను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీఎం పోషణ్‌ ప్రోగ్రామ్‌ అప్రూవల్‌ బోర్డు సూచించింది.
అట్టడుగున ఢిల్లీ
కరోనా మహమ్మారి దేశంలో విజృంభించిన సమయంలో పాఠశాలలు మూతపడ్డాయి. దీనితో విద్యార్థులకు అలవెన్సును అందించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్‌, పుదుచ్చేరి తమ విద్యార్థులందరికీ అలవెన్సును అందించాయి. ఢిల్లీ మాత్రం ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆశించిన తీరులో ప్రదర్శనను కనబర్చలేకపోయింది. ఢిల్లీలో 10.21 లక్షల మంది ప్రాథమిక తరగతుల చిన్నారుల్లో 7.44 లక్షల మందికి పైగా (73 శాతం మంది) భోజనాన్ని లేదా అలవెన్సును పొందారు. 27 శాతం మంది పథకం కింద లబ్దిని పొందలేదు. ఇక 7.87 లక్షల మందికి పైగా ప్రాథమికోన్నత తరగతులకు చెందిన చిన్నారుల్లో 5.75 లక్షల మందికి పైగా (73 శాతం మంది) అలవెన్సును పొందగలిగారు. ఇందులోనూ 27 శాతం మంది చిన్నారులకు ఢిల్లీ ప్రభుత్వం అందించలేకపోయింది.
తెలంగాణ కంటే ఎపి బెటర్‌
మిడ్‌ డే మీల్‌ పథకం కవరేజీ విషయంలో పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణ కంటే చక్కని ప్రదర్శనను కనబర్చింది. ఏపీలో ప్రాథమిక తరగతులలో నమోదిత విద్యార్థుల సంఖ్య 22.22 లక్షలుగా ఉన్నది. ఇందులో 20.12 లక్షల మంది (91 శాతం మంది) పథకం కింద లబ్దిని పొందారు. అలాగే, 13.29 లక్షల మంది ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల్లో 11.85 లక్షల మందిని (89 శాతం మంది) ఏపీ ప్రభుత్వం కవరేజీ చేసింది.
అయితే, తెలంగాణ మాత్రం వెనకబడింది. పేలవ ప్రదర్శనతో బీహార్‌ తర్వాతి స్థానంలో ఉన్నది. ఇక్కడ 11.22 లక్షల మంది ప్రాథమిక చిన్నారుల్లో 8.4 లక్షల మంది (75 శాతం మంది) మధ్యాహ్న భోజన పథకం కింద లబ్దిని పొందారు. 25 శాతం మంది దూరమయ్యారు. ఇక 6.68 లక్షల మంది ప్రాథమికోన్నత విద్యార్థుల్లో 4.73 లక్షల మంది (71 శాతం మంది) మాత్రమే పథకం కింద లబ్దిని పొందారు. 29 శాతం మందికి మధ్యాహ్న భోజనం అందకపోవటం గమనార్హం.
యూపీలో ఈ పథకం కవరేజీ ప్రాథమిక పాఠశాల చిన్నారుల విషయంలో 81 శాతం కాగా.. ప్రాథమికోన్నత విద్యార్థుల విషయంలో 78 శాతంగా ఉన్నది. తమిళనాడు విషయంలో ఇది వరుసగా 85 శాతం, 77 శాతంగా ఉన్నది. అలాగే, పంజాబ్‌లో 88 శాతం, 86 శాతంగా నమోదైంది. జార్ఖండ్‌లో 84 శాతం, 73 శాతంగా ఉన్నది.
ఆ రాష్ట్రాల్లో 100 శాతం కవరేజీ
మహారాష్ట్ర, గోవా, లఢక్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిలు వంద శాతం కవరేజితో చక్కటి ప్రదర్శనను కనబరిచి ముందువరుసలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, ఒడిశా, నాగలాండ్‌లో 99 శాతం కవరేజీని నమోదు చేశాయి. అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌కు చెందిన సమాచారం ఇంకా అందాల్సి ఉన్నది.