చిలమత్తూరు : గతంలో రిచ్ మ్యాన్ సిల్క్ పరిశ్రమలో పని చేసి లాక్అవుట్ నేపధ్యంలో తమ జీవనోపాధి పోగొట్టుకున్న కార్మికులకు పూర్తిస్థాయిలో పిఎఫ్, సెటిల్మెంట్ డబ్బులు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కొడికొండ చెక్పోస్టు వద్ద గల రిచ్ మ్యాన్ సిల్క్ పరిశ్రమ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు ఫిరంగి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాలు పని చేసిన కార్మికులను మోసం చేసిన యాజమాన్యం గత కొద్ది సంవత్సరాల క్రితం లాక్ అవుట్ చేసిందన్నారు. అయితే కార్మికులకు న్యాయంగా రావాల్సిన పిఎఫ్, సెటిల్మెంట్ డబ్బులు పూర్తిగా ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. అయితే ఆ పరిశ్రమను వెరొకరి ఇచ్చి ఈ మధ్య కాలంలో పున్ణ ప్రారంభాంచారని అన్నారు. అయితే దానిని వ్యతిరేకించడం లేదని గతంలో పని చేసిన కార్మికులకు న్యాయం చేయకుండా నడపడం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు న్యాయం చేయకపోతే పరిశ్రమలో పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామచంద్ర, కార్మికులు శ్రీనివాసులు, శ్రీరాములు, నంజుండప్ప, రామాంజినేయులు, ఆశ్వర్థనారాయణ, నాగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, సెల్వరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










