Nov 22,2023 00:17

ప్రజాశక్తి - వినుకొండ : తాను అభివృద్ధి చేశాను కాబట్టే ప్రజల ముందు ధైర్యంగా రాగలిగానని, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జీవీ ఆంజనేయులు హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పట్టణంలోని 32వ వార్డు విష్ణుకుండి నగర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో విష్ణుకుండి నగర్‌లో తాగునీటికి ప్రజలు అల్లాడారని, ట్యాంకర్ల ద్వారా నీరిచ్చారని చెప్పారు. కాల్వకట్ట రోడ్లపై కంపచెట్లు పెరిగి చనిపోయిన జంతువుల్ని వేయడం వల్ల విష్ణుకుండి నగర్‌కు దుర్వాసన వచ్చేదని ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. గాయత్రి నగర్‌లో చెరువునూ అభివృద్ధి చేశామన్నారు. టిడిపి అధికారంలో ఉండగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న జీవీ ఆంజనేయులు పట్టణంలో తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని, ఘాట్‌ రోడ్‌ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఎందుకు నిర్మించ లేదని, గిరి ప్రదక్షిణ రోడ్డు ఎందుకు నిర్మించలేదని, వంద పడకల ఆసుపత్రి ఎందుకు నిర్మించలేదని, స్టేడియం ఎందు కు నిర్మించలేదని, కూరగాయల మార్కెట్‌, రైల్వే అండర్‌ ప్రాసెస్‌ బ్రిడ్జి ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.