న్యూఢిల్లీ : కరోనా కారణంగా అర్దాంతరంగా నిలిచిపోయిన ఐపిఎల్ 2021 సెకండాఫ్ మ్యాచులను యుఎఇ వేదికగా నిర్వహించేందుకు బిసిసిఐ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, మ్యాచ్ల షెడ్యూల్ మాత్రం ఇప్పటి వరకూ ప్రకటించలేదు. అయితే, సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య లీగ్ జరగనుందని బిసిసిఐకి చెంది ఓ అధికారి తెలిపారు. ఐపిఎల్ రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుందన్నారు. కాగా, క్వాలిఫైయర్-1, క్వాలిఫైయర్-2 అక్టోబర్ 10, 13 తేదీల్లో జరగనుండగా.. ఎలిమినేటర్ అక్టోబర్ 11న నిర్వహించనున్నారు. 'సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపిఎల్ రెండో దశను ముంబై-చెన్నై మ్యాచ్తో ప్రారంభించాలని మేము నిర్ణయించాం. లీగ్కు సంబంధించి పూర్తి ప్రణాళిక త్వరలోనే ఆయా ఫ్రాంఛైజీలకు ఇవ్వనున్నాం'' అని సదరు అధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పాయింట్ల పట్టికలో ధోనీ సేన 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.