Jul 25,2021 10:12

దాచేపల్లి (గుంటూరు) : పాఠశాలలో సమయానికి విధులకు హాజరవ్వాలని ప్రధానోపాధ్యాయిని చెప్పినందుకు సదరు ఉపాధ్యాయిని తన భర్తతో దాడికి పురమాయించిన ఘటన గుంటూరు దాచేపల్లిలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఉపాధ్యాయిని భర్తతో సహా ఏడుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
    గురజాల సిఐ ఉమేష్‌ వివరాల మేరకు... తెలంగాణలోని నల్గొండ జిల్లా వాడపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయిని రాధిక.. తమ పాఠశాలలో ఉపాధ్యాయిని రజని పాఠశాలకు సక్రమంగా రావడం లేదన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయిని రజని, రాధిక పై కోపం పెంచుకున్నారు. రజని భర్త శ్రీనివాసరెడ్డి మల్కాపట్నం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. తన భర్తతో విషయాన్ని చెప్పి ప్రధానోపాధ్యాయిని రాధికపై దాడికి పురమాయించింది. ఈ నెల 19 వ తేదీన పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాల ఉపాధ్యాయుడు దీపాల కఅష్ణప్రసాద్‌, ప్రధానోపాధ్యాయిని పులగం రాధిక దంపతులు కలిసి వాహనంపై వస్తుండగా... మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఆరుగురు కారులో రామాపురం అడ్డరోడ్డు వద్దకు వచ్చి వాహనాన్ని అడ్డుకొని రాధిక దంపతులపై దాడి చేశారు. వారివద్ద ఐదు సవర్ల బంగారాన్ని అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన జగునూరు నరేష్‌, కోడి నవీన్‌, బత్తుల శ్రీకాంత్‌, గొట్టపర్తి వెంకటేష్‌, వల్లభాయి నవీన్‌, మొండికత్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణమయిన శ్రీనివాసరెడ్డితో సహా ఏడుగురిని అరెస్టుచేసి గురజాల కోర్టుకు హాజరుపరచినట్లు సిఐ ఉమేష్‌ వివరించారు.

ఉపాధ్యాయ దంపతులపై సస్పెన్షన్‌ వేటు..
ప్రధానోపాధ్యాయిని దంపతులపై దాడి కేసులో ప్రమేయమున్న ఉపాధ్యాయ దంపతులు రజని, శ్రీనివాసరెడ్డిలపై సస్పెన్షన్‌ వేటుపడింది. వారిద్దరినీ సస్పెండ్‌ చేసినట్లు నల్గండ జిల్లా విద్యాశాఖాధికారి బి.భిక్షపతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.