ప్రజాశక్తి-నందిగామ: చిన్నారులు, కిశోర బాలలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టి పోషణమహా కార్యక్రమంలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డల ఎదుగుదలకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించనున్న పోషణమహా కార్యక్రామంలో భాగంగా శుక్రవారం నందిగామ ఐసిడిఎస్ ప్రాజెక్టులో మహిళలకు నిర్వహించిన వైద్య పరీక్షలు, సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన్న ఊయ్యాల వేడుక కార్యక్రమాలకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ గర్భం దాచిన నాటి నుండి శిశువుకు జన్మనించేతవరకు సుమారు 36 వారాల పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుని అవసరమైన పోష్టికాహారన్ని తీసుకున్నపుడే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మను ఇవ్వగలుగుతారన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన భాధ్యత అంగన్వాడీ సుపర్వైజర్లపై ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు రక్తిహీనత వల్ల అనేక రుగ్మతులను ఎదురుకోవాల్సి వస్తుందన్నారు. సంపూర్ణ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్త హీనతను ఎదుర్కోగలుగుతారన్నారు. వైఎస్సార్ పోషణ క్విట్ల ద్వారా ఆరు రకాల పోషణ పద్దార్థాలను పంపిణీ చేస్తున్నామని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఏ. రవీంద్రరావు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ జి.ఉమాదేవి, సిడిపివోలు వి.భాగ్యరేణుక, జె.లక్ష్మిభార్గవి, కె.గ్లోరి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ టి.రవి పాల్గొన్నారు.










