Jul 22,2021 18:13

కొలంబో : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మ్యాచ్‌లను ముగించే విధానాన్ని దగ్గరగా చూడటం తనపై తీవ్ర ప్రభావం చూపించిందని, అదే శ్రీలంకపై విన్నింగ్‌ నాక్‌ ఆడేలా చేసిందని టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ (69 నాటౌట్‌) అసాధారణ ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించిన విషయం తెలిసిందే. టాపార్డర్‌ విఫలమైన వేళ ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. అయితే, ఈ విన్నింగ్‌ నాక్‌కు ధోనీనే కారణమని తెలిపాడు. ''ఛేజింగ్‌లో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లాలని ధోనీ పదే పదే చెప్పేవాడు. క్రీజులో పాతుకుపోవడానికి సమయం తీసుకోవాలంటాడు. అంతేకాకుండా చివర్లో బౌలర్లపై ఒత్తిడి నెలకొని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. వారి తప్పులను బ్యాట్స్‌మన్‌ అనుకూలంగా మార్చుకోగలిగితే బిగ్‌ షాట్స్‌తో సులువుగా మ్యాచ్‌ను ముగించవచ్చని చెప్పేవాడు. ఆ సూత్రంతోనే ఈ మ్యాచ్‌లో రాణించాను'' అని తెలిపాడు. కాగా, తన తండ్రే తన మొదటి కోచ్‌ అని దీపక్‌ చాహర్‌ స్పష్టం చేశాడు. చివరిదైన నామమాత్రపు మూడో వన్డే శుక్రవారం జరగనుంది.

ధోనీ చెప్పిన సూత్రాలే పాటించా.. రాణించా : దీపక్‌ చాహర్‌