Nov 05,2023 08:18

న్యూఢిల్లీ :   ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దట్టమైన పొగ మంచు దుప్పటి ఢిల్లీని కప్పేస్తోంది. వరుసగా మూడరోజు శనివారం కూడా వాయు నాణ్యతా సూచీ (ఎక్యూఐ) 540కి చేరింది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే పెరిగిన గాలి వేగంతో రాత్రిపూట కాలుష్య స్థాయిలు స్వల్పంగా మెరుగుపడినప్పటికీ .. దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో గాలిలో విషవాయువులు పిఎం 2.5కి చేరింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే 80 రెట్లు ఎక్కువని అధికారులు తెలిపారు. 

దీంతో పిల్లలు, వృద్ధులలో శ్వాస కోశ మరియు కంటి సమస్యలు అధికమవతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజనులో ఇలా కాలుష్య తీవ్రత పెరగడం ఇదే మొదటిసారని, . దీంతో  ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించినట్లు తెలిపారు.  రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్  మెరుగైన వాయు నాణ్యతా ప్రమాణం కోసం చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ని కోరారు. ఉత్తర భారత దేశం మొత్తం  ఇదే గాలిని పీలుస్తోందని  ఆవేదన వ్యక్తం చేశారు.  ఢిల్లీ  - ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో అత్యవసరం  కాని నిర్మాణాలను నిలివేయడంతో పాటు కార్ల రాకపోకలను నిషేధిస్తున్నట్లు తెలిపారు.  నిషేధిత బస్సులను పంపవద్దని కోరుతూ గోపాల్ రాయ్ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు  లేఖ రాశారు. ‘‘ ప్రస్తుతం దిల్లీలో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ బస్సులే తిరుగుతున్నాయి. కానీ యుపి నుండి  నిషేధిత బీఎస్‌3, బీఎస్‌4 వాహనాలు ఆనంద్‌ విహార్‌ డిపోకు వస్తున్నాయి. విపరీతంగా పొగను వదిలే ఆ వాహనాలను ఢిల్లీలోకి పంపవద్దని యుపి  ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను' అని ఆ  లేఖలో పేర్కొన్నారు.   అభ్యర్థించారు.