ప్రజాశక్తి - తిరువూరు : తిరువూరు ఆస్టర్ రమేష్ అమరావతి ఆస్పత్రిలో అత్యాధునిక క్యాత్ ల్యాబ్, మల్టీ స్లైస్ సి.టి.స్కాన్ సర్వీసులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతంలో కూడా గుండెపోటుకు అత్యవసర చికిత్స అందుబాటులోనికి తీసుకురావాలనే సంకల్పంతో కోట్ల ఖరీదు చేసే నిర్ధారణ యంత్రం క్యాత్ ల్యాబ్ను తిరువూరులో అందుబాటులోకి తీసుకువచ్చామని ఆస్టర్ రమేష్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్బాబు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా తిరువూరు మారుమూల ప్రాంత ప్రజలు గుండెపోటు వచ్చినప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుండా ఇదే ఆస్పత్రిలో సకాలంలో చికిత్స చేయటం జరుగుతుంది. ఎయిమ్స్, న్యూఢిల్లీలోని కార్డియాలజీ డిఎం, సూపర్ స్పెషాలిటీ పట్టా పొందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామ్ మనోహర్తో పాటు క్లినికల్ కార్డియాలజిస్టులు సాదిఖ్, ఖలీఖ్ ఆస్టర్ రమేష్ అమరావతి ఆసుపత్రిలో గుండె వైద్య సేవలందిస్తారని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. యాంజియోగ్రామ్ దశలవారీగా యాంజియోప్లాస్టీ, గుండె రంధ్రాలకు డివైజ్ చికిత్సలు, పేస్ మేకర్, గుండె బైపాస్ వంటి అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అందిస్తామని, సూపర్ స్పెషాలిటీ వైద్య సర్వీసులైన చిన్న పిల్లల గుండె వైద్య నిపుణులు, మెదడు, నరములుఫిట్స్ వైద్య నిపుణులు, జీర్ణకోశ వైద్య నిపుణులు, ఊపిరి తిత్తుల వైద్య నిపుణులు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు చేశారు. ఈఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు మల్టీ స్లైస్ సిటిస్కాన్ మెషీన్ కూడా అందుబాటులోనికి తీసుకువచ్చామని, బ్రెయిన్ యాంజియో, క్యాన్సర్ డిటెక్షన్, న్యూరో, ఆర్థో, యాక్సిడెంట్స్, ట్రామా రోగులకు అత్యవసర సమయంలో చికిత్సలు అందించనున్నట్లు చైర్మన్ కోనేరు వెంకటకష్ణన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గుండె జబ్బుల వైద్య నిపుణురాలు స్నిగ్ధ, అమరావతి ఆసుపత్రి డైరెక్టర్ శావల దేవదత్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నెక్కలపు కష్ణ చైతన్య, గ్రూప్ బిజినెస్ హెడ్ డాక్టర్ వై.కార్తీక్ చౌదరి, డాక్టర్లు శావల రత్నాకర్, కోనేరు కావ్య, కోనేరు సాయినిఖిల్తదితరులు పాల్గొన్నారు.










