Dec 27,2022 19:37

సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే చింతల

ప్రజాశక్తి-వాల్మీకిపురం: ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో వారి జీవన ప్రమాణం మెరుగవడంతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తిరుపతి రోడ్డు, చాకలిబండ, తిరుచుట్టివీధి, హసన్‌ఖాన్‌వీధి, బజారువీధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల వివరాలు తెలియజేస్తూ సమస్యలపై ప్రజలను ఎమ్మెల్యే చింతల ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ ప్రజల సుఖసంతోషాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర చరిత్రలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం అద్భుతమైన నిర్ణయమన్నారు. ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా లబ్ధిదారులకు అందుతోందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్‌ రెడ్డి మూడున్నరేళ్ల కాలంలో తొంబై ఎనిమిదిశాతానికిపైగా నెరవేర్చారన్నారు. అర్హతే ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను సీఎం జగన్‌ అందిస్తున్నారన్నారు. ఆదర్శంగా, పారదర్శకంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పేదలు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వలంటీర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఫిరోజ్‌ ఖాన్‌, ఎంపిడిఒ షబ్బీర్‌ అహ్మద్‌, ఇఒ ఉదరు కుమార్‌, సర్పంచ్‌ గంగులమ్మ, నాయకులు చింతల ఆనంద రెడ్డి, చింతల శివానంద రెడ్డి, నీళ్లభాస్కర్‌, కేశవ రెడ్డి, అబ్దుల్‌ కలీమ్‌, రఘు, రాజేష్‌, సైఫుల్లా, చికెన్‌మస్తాన్‌, సురేష్‌ రెడ్డి, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.