Sep 25,2023 22:52

అరెస్ట్‌ల పర్వం... ఉద్రిక్తత...

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : పోలీసుల అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా అంగన్‌వాడీలకు మద్దతుగా నిలిచి ఎంజి రోడ్డులో నిరసన తెలియజేయడానికి బయలుదేరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు, వి.వెంకటేశ్వర్లు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.వి.ఆంజనేయులు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, సిఐటియు ఆశా వర్కర్లు యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ కమల, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.సోమేశ్వరరావు, నాయకులు బాబూరావు, శ్రీను, గురుమూర్తి, ప్రసాద్‌, రమణ, సుబ్బారావును అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఉన్న రాష్ట్ర నాయకులకు పలువురు తమ సంఘీభావం తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.వెంకటేశ్వరావు, దోనేపూడి కాశీనాథ్‌ సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వర రావు అంగన్వాడీలకు అండగా నిలిచిన సిపిఎం నాయ కులను అరెస్టు చేయటం అమానుషమన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు దోనేపూడి శంకర్‌, జిల్లా నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రజానాట్యమండలి నాయకులు ఎస్‌.కె నజీర్‌, తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తమ సంఘీభావం తెలిపారు. జనసేన మైలవరం అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్‌ రావు(గాంధీ), సిఐటియు మండల కార్యదర్శి యంమహేష్‌, అలేటి విఠల్‌రావు, ప్రజాసంఘాల నాయకులు చింతల శివ, బేబీ సరోజినీ,లింగాల పార్వతి, భాష, నారాయణ, మిడేమిల్స్‌ మంగమ్మ, రాజేశ్వరీ, చిట్టెమ్మ, నాగరాజు, వాసుదేవన్‌, వెనిగళ్ళ మురళీమోహన్‌, అమ్మాజీ తదితరులు సంఘీభావం తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్‌ : అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని రాష్ట్ర అంగన్వాడీ నాయకుల పిలుపుమేరకు విజయవాడకు బయలుదేరి వెళుతున్న అంగన్వాడీ మహిళా కార్యకర్తలను, రాష్ట్ర నలుమూలల నుండి విజయవాడకి వచ్చిన అంగన్వాడి మహిళ కార్యకర్తలను రైల్వే స్టేషన్లు బస్టాండ్లు వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సోమవారం అంగనవాడి మహిళ కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుండి అన్ని మండలాల నుంచి బయలుదేరి వచ్చారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అనంతరం కొంతమందిని సింగ్‌నగర్‌ వడ్ర కాలనీలో గల కళ్యాణ మండపంలో 150 మంది అంగన్వాడి మహిళా కార్యకర్తలను నిర్బంధించారు. కండ్రికలో గల లగడపాటి రాజగోపాల్‌ కళ్యాణమండపంలో దాదాపు 250 మంది అంగనవాడీ మహిళా కార్యకర్తలను నిర్బంధించారు. అరెస్ట్‌ అయిన అంగన్వాడీ మహిళా కార్యకర్తలకు సిపిఎం సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, సిఐటియు సెంట్రల్‌ సిటీ అధ్యక్షులు కె.దుర్గారావు, డివైఎఫ్‌ఐ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎస్‌కె. నిజాముద్దీన్‌, కెవిపిఎస్‌ సిటీ సెంట్రల్‌ కార్యదర్శి సిహెచ్‌.శ్రీనివాస్‌, అనంతరం మహిళ కార్యకర్తలకు టి.బిస్కెట్స్‌, అందజేశారు. పెనుగంచిప్రోలు: వివిధ గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తలను ధర్నాకు వెళ్ళకుండా పోలీసులు కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేసి ఆదివారం రాత్రికే స్టేషనుకు తరలించారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, మండల సీఐటీయూ కార్యదర్శి దారా నాగేశ్వరరావు, సీపీఎం కార్యదర్శి గురవయ్య పలువురు నేతలు స్టేషనుకు చేరుకుని ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. సోమవారం రాత్రి వరకు స్టేషన్‌ వద్దనే వుంచారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సువర్చలా, నాగమణి విజయలక్ష్మి, రమాదేవి, రజనీ, అనూరాధ, తదితరులు పాల్గొన్నారు. మైలవరం : స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు రాస్తారోకో విరమించేది లేదని నినాదాలు చేశారు. కొంతసేపు అంగన్వాడీలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. అనంతరం అంగన్వాడీలను సిఐటియు నాయకులను బలవంతంగా వ్యాన్లు ఎక్కించి మైలవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌ వద్ద కూడా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌.సుధాకర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఆర్‌.ఆర్‌.వి.పుష్పకుమారి, కార్యదర్శి టి.శారద, పి.పద్మ, వి.రాజేశ్వరి, సిహెచ్‌.శారద, బి.భాయమ్మ, ఉష, సరోజినీ, ఝాన్సీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కంచికచర్ల : సోమవారం తెల్లవారుజాము నుండి నందిగామ రూరల్‌ సిఐ ఆధ్వర్యంలో కంచికచర్ల ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి మండలంలోని పరిటాల సమీపంలో దొనబండ చెక్‌పోస్ట్‌ వద్ద బందోబస్తు నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు కంచికచర్ల,, నందిగామ, చిల్లకల్లు, వత్సవాయి, తదితర ప్రాజెక్టుల నుండి విజయవాడ వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను మహిళా పోలీసులు దొనబండ చెక్‌పోస్ట్‌ వద్ద నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. దొనబండ చెక్‌ పోస్ట్‌ వద్ద అదుపులోకి తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రత్యేక వాహనంలో ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్థానిక ఒసి క్లబ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఒసి క్లబ్‌ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. యూనియన్‌ నాయకులను ముందుగానే ఇళ్ళకు వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మధ్యాహ్నం భోజనం పధకం కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కంచికచర్ల ఒసి క్లబ్‌లో పోలీసులు అదుపులో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు సిఐటియు మండల అధ్యక్షుడు బెజ్జం భూషణం సంఘీభావం తెలిపారు. నందిగామ : చలో విజయవాడకు వెళుతున్న నందిగామకు చెందిన 45 మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నందిగామ పోలీస్‌ స్టేషన్‌ లో నిర్బంధించారు. అనంతరం ఓసీ క్లబ్‌ కు తరలించారు. సిఐటియు నాయకులు కట్టారపు గోపాల్‌, కర్రీ వెంకటేశ్వరావు అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఖండించారు.వన్‌టౌన్‌ : విజయవాడ గాంధీనగర్‌ అలంకార్‌ సెంటర్‌ నందు ధర్నా చౌక్‌కి వస్తున్న సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు యూనియన్లకు చెందిన అంగన్వాడీలను సోమవారం పోలీసులు విచక్షణా రహితంగా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేశారు. ఈ నేపద్యంలో వన్‌టౌన్‌ రైల్వేస్టేషన్‌ వెస్ట్‌ ప్రాంతంలో, కనకదుర్గ దేవస్థానానికి వచ్చిన వారిలో కొంతమందిని కనకదుర్గా నగర్‌లో వన్‌టౌన్‌, భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన అంగన్‌వాడీలకు సిఐటియు పశ్చిమ సిటీ నాయకులు ఇ.వి. నారాయణ, వెంకట్రావు, సిపిఎం పశ్చిమ సిటీ సభ్యులు కె. సూరిబాబు, గాదె ఆదిలక్ష్మి, 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయి సత్యబాబు పరామర్శించి, వారికి సంఘీభావం ప్రకటించారు.