అమరావతి : ఎపి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు శనివారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పునిచ్చింది. కలిదిండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు ఆయన ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో సత్యనారాయణ కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడ్డారని, కేసు విచారణలో భాగంగా కోర్టుకు ఆలస్యంగా వచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. రూ.50 వేల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. కాగా, శిక్ష నిలిపివేయాలంటూ సత్యనారాయణ, ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా.. విజ్ఞప్తిని లంచ్ తర్వాత పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.