Nov 21,2023 00:39

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం

ప్రజాశక్తి- కశింకోట, అనకాపల్లి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద కశింకోట, అనకాపల్లి మండలాలకు చెందిన అంగన్వాడీలు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్‌ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులు అనేక సమస్యలతో మానసిక ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోగా అధిక పని భారాన్ని పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కల్పించి వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, మినీ వర్కర్‌ని మెయిన్‌ వర్కర్‌గా గుర్తించాలని, అంగన్వాడి సెంటర్‌ నిర్వహణ ఒకే యాప్‌ ద్వారా కొనసాగించాలని, పోషకాహారపు సరుకులు నాణ్యత పెంచాలని, మెనూ చార్జీలు పెంచి ప్రభుత్వమే సరఫరా చేయలని డిమాండ్‌ చేశారు. పై సమస్యలను పరిష్కరించకుంటే డిసెంబర్‌ 8 నుండి సమ్మె చేస్తామని హెచ్చరించారు. అనంతరం సిడిపిఓకి వినతి పత్రం, సమ్మె నోటీసు అందజేశారు. ఈ ధర్నాలో యూనియన్‌ నాయకులు కాసులమ్మ, తనూజ, ఉమా నారాయణమ్మ, విజయ, కృష్ణవేణి, సిఐటియు నాయకులు డి శ్రీను పాల్గొన్నారు.
యలమంచిలి : అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్‌ ప్రోజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, సూపర్‌వైజర్‌ రంజాన్‌బీబికి సమ్మె నోటీలు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రొంగలి రాము, అచ్యుతాపురం కన్వీనర్‌ కె.సోమునాయుడు, వరలక్ష్మి, సావిత్రి కుమారి, లక్ష్మి, జయ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం : మండలంలోని ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం సమ్మె నోటీసును ఐసిడిఎస్‌ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, యూనియన్‌ నాయకురాలు వివి రమణమ్మ, ఎం రమణి, బి రమణమ్మ, సిహెచ్‌ దేవి, జి అమ్మాజీ, ఎస్‌ జగదీశ్వరి, ఆర్‌ఎస్‌ లక్ష్మి, డి పుష్ప దేవి, ఎం వరలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు యు.సత్యవతి, సిఐటియు నాయకులు ఎం. గౌరీశ్వరరావు పాల్గొన్నారు.
కె.కోటపాడు : అంగన్వాడీలకు బడ్జెట్‌ పెంచాలని ఇచ్చిన హామీలు నిలబెట్టాలని, రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అధికారులకు సమ్మె నోటీసు ఇచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి. వివి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలను ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నేత గండి నాయన బాబు, వ్యకాస నేత డి.వెంకన్న, సిపిఎం నేత ఎర్రదేముడు, యూనియన్‌ నాయకులు జి కుమారి, పి లక్ష్మి, అమ్మాజీ, భవాని, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.
గొలుగొండ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సోమవారం సిడిపిఒకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ,ఐసిడియస్‌కు బడ్జెట్‌ పెంచాలన్నారు. ఉద్యోగ భద్రతా కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, అంగన్‌వాడి ప్రాజెక్టు నాయకులు సిహెచ్‌.బ్రమరాంబ, ఎం.మంగతాయారు, లక్ష్మి తదితర్లు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ : అంగన్‌వాడీ వర్క్‌ర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ సమస్యలు పరిష్కారం కొరకు డిసెంబరు 8వ తేదీ నుండి నిరధిక సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు తెలిపారు. నర్సీపట్నం ఐసిడిఎస్‌ సిడిపిఒకు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ, బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, అంగన్‌వాడి ప్రాజెక్టు నాయకులు వి.సామ్రాజ్యం, మహలక్ష్మీ, నాగమణి, కృష్ణవేణి పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలు డిసెంబర్‌ 8 నుంచి చేపట్టే సమ్మె నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌కు, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి. మణి, అధ్యక్షులు వై.తులసి, ప్రధాన కార్యదర్శి ఎల్‌.దేవి సమ్మె నోటీసును సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి కె.పద్మావతి, కె.బృందావతి, ఆర్‌.శోభారాణి, బి.శ్యామల, ఐ.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయాలి : లోకనాథం
నక్కపల్లి : అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ డిశంబర్‌ 8 నుండి నిర్వహించే నిరవధిక సమ్మె నోటీసును సోమవారం యూనియన్‌ నాయకులు స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సూపర్వైజర్‌ లలితకు అందజేసారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ వేతనాలు పెంచాలని, గ్రాట్యూటి అమలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శాసనమండలిలో సంబంధితశాఖా మంత్రి ఆంగన్వాడీ యూనియన్లతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని ఇచ్చిన హామీ ఇంత వరకు అమలు చేయలేదన్నారు. హెల్పర్ల ప్రమోషన్‌లో నిబంధనలు రూపొందించాలని, రాజకీయజోక్యం అరికట్టాలని, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి, యూనియన్‌ నాయకులు నాగఫణి, నూకరత్నం, రమణమ్మ భవాని, కవిత, రాజారత్నం పాల్గొన్నారు.