Jun 06,2023 10:07

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను రెజ్లింగ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న భారత రెజ్లర్లు కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో హోంమంత్రిని కలిసిన రెజ్లర్లు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. హోంమంత్రిని కలిసిన వారిలో రెజ్లర్లు భజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌, సంగీతా ఫోగట్‌, సత్యవర్త్‌ కడియన్‌ ఉన్నారు. మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్‌ చేశారు. హోంమంత్రి అమిత్‌ షా తమకు అనుకూలంగా హామీ ఇవ్వలేదని రెజ్లర్లు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని చెప్పినట్లు రెజ్లర్లు పేర్కొన్నారు. 'ఉద్యమం ఆపేశామనే వార్త పూర్తిగా తప్పు. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమేమీ వెనక్కు తగ్గలేదు. ఆందోళనతోపాటు రైల్వేలో నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు' అని సాక్షి మాలిక్‌ అన్నారు. సత్యవర్త్‌ కడియన్‌ మాట్లాడుతూ.. తమకు హోంశాఖ మంత్రి నుంచి ఆశించిన ప్రతిస్పందన రాలేదని నిరాశ వ్యక్తం చేశారు. కేంద్రమంత్రితో శనివారం రాత్రి భేటీ అయినట్లు బజరంగ్‌ పునియా మీడియా వద్ద ధ్రువీకరించారు. ప్రస్తుతానికి అంతకంటే తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు.