Jan 29,2023 20:18
  • అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఘనవిజయం

ఫోచెఫ్‌స్ట్రూమ్‌ : భారత బాలికలు అదరగొట్టారు. తొలిసారిగా నిర్వహించిన అండర్‌ా19 టీ20 ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచారు. దక్షిణాఫ్రికాలో ఈ టోర్నిలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు వికెట్లతో ఏకపక్షంగా విజయం సాధించారు. న్యూజిలాండ్‌ విధించిన 69 పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్‌ ఛేదించింది. ఓపెనర్లు కెప్టెన్‌ షెఫాలీ వర్మ (15), శ్వేత షహర్వాత్‌ (5) త్వరగా పెవిలియన్‌ చేరుకున్నా.. గొంగడి త్రిష (24), సౌమ్య తివారీ (24) జోడీ జట్టును విజయం వైపు నడిపించింది. మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించిన తరువాత జట్టు స్కోరు 66 వద్ద త్రిష అవుటైనా హ్రిషితా బసు (0)తో కలిసి తివారీ జట్టుకు విజయం అందించింది. ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇంగ్లండ్‌ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కట్టడి చేసింది. ఇంగ్లండ్‌ జట్టులో రైనా మాక్‌ డొనాల్డ్‌ గే (19) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సోఫీ స్మాలే 11, అలెక్సా 11, నిమా హోలాండ్‌ 10 పరుగులు చేశారు. మిగిలిన వారు రెండెంకెల స్కోరు కూడా అందుకోలేకపోయారు. భారతజట్టులో నాలుగు ఓవర్లలో ఆరు పరుగులకే రెండు వికెట్లు సాధించిన టిటాస్‌ సాధు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయింది. అర్చనా దేవి, పర్షవి చోప్రా కూడా రెండేసి వికెట్లు సాధించారు. ఇంగ్లండ్‌ క్రీడాకారిణి గ్రేస్‌ స్కారివెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

  • నిలకడగానే ఛేదన..

పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఛేదనలో భారత బ్యాటర్లు ఏమాత్రం రిస్క్‌ తీసుకోలేదు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు షఫాలీ వర్మ (15), శ్వేత షహర్వాత్‌ (5) ఔటైనప్పటికీ.. గొంగడి త్రిష (24)తో కలిసి సౌమ్య తివారి (24లి) కీలక భాగస్వామ్యం నిర్మించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ విజయం ఖాయమైంది. అయితే మరో రెండు పరుగులు చేస్తే టీమ్‌ఇండియా విజయం సాధిస్తుందనగా.. త్రిష ఔటైంది. సౌమ్య తివారి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 14 ఓవర్లలో 69/3 స్కోరుతో భారత్‌ను గెలిపించింది. దీంతో అరంగేట్ర అండర్‌ - 19 టీ20 ప్రపంచకప్‌ టీమ్‌ఇండియా సొంతమైంది. గతంలో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలోని భారత్‌ కూడా తొలిసారి నిర్వహించిన 2007 టీ20 ప్రపంచకప్‌ను ఇలానే గెలుచుకొన్న విషయం తెలిసిందే.