Sep 27,2023 16:02

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత లేదంటున్న ఈ బందిపోట్లకు.. ఆయనకు ఎదురెళ్లి నిలదీసే దమ్ము మాత్రం లేదని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవ చేశారు. బుధవారం లోటస్‌ పాండ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ..''కేసీఆర్‌ అడగడు.. ఆయన ఇవ్వడు.. తొమ్మిదిన్నరేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. మోడీ వచ్చిన ఐదేళ్లలో ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు?. విభజన హామీల సంగతి ఏంటని ఎందుకు ప్రశ్నించలేదు? తెలంగాణకు దక్కాల్సిన నిధులపై ఎందుకు నిలదీయలేదు? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ అనుమతులపై ఏం పోరాటాలు చేశారు. కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల్లో రాష్ట్ర వాటా ఎందుకు అడగడం లేదు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వ విద్యాలయం, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీల సంగతిపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదు. ప్రతి ఏడాది బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తుంటే.. మీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు కాలేదా? గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే ''బీజేపీ రాష్ట్ర సమితి'' దోస్తానా కదా. దొరకు కుటుంబ క్షేమంపై ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంపై సోయి రాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ కేసీఆర్‌ అండ్‌ కోకు రాష్ట్రంలో ఉండే అర్హతే లేదు'' అని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.