- స్వాధీనానికి బిడ్డింగ్లు
- దీపమ్ సెక్రటరీ పాండే వెల్లడి
న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్ను కొనుగోలు చేయడానికి విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తూహిన్ కాంత్ పాండే తెలిపారు. ఐడిబిఐ బ్యాంక్ విక్రయానికి దరఖాస్తులను స్వీకరించగా మంచి స్పందన వచ్చిందని ఆయన ఓ ఇంటర్యూలో తెలిపారు. దేశీయ సంస్థలే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఈ బ్యాంక్ స్వాధీనానికి పోటీ పడ్డారన్నారు. ఈ డాక్యూమెంట్లను ఆర్బిఐకి సమర్పించడం జరిగిందన్నారు. వాటాల విక్రయం తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కనీస లేదా మైనారిటీ వాటానే ఉంటుందన్నారు. వాటాల విక్రయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు నాటికి విక్రయ పక్రియను పూర్తి చేయనున్నట్లు పాండే తెలిపారు. ఐడిబిఐ బ్యాంక్లోని మెజారిటీ 60.72 శాతం వాటాలను దేశ, విదేశీ కార్పొరేట్లకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఐడిబిఐ బ్యాంక్ను విదేశీ శక్తుల పరం చేయడానికి మోడీ సర్కార్ పలు నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఐడిబిఐ బ్యాంక్లో మెజారిటీ వాటాల విక్రయానికి వీలుగా ప్రకటించిన దరఖాస్తులను స్వీకరణను డిసెంబర్ 16 నుంచి ఇటీవల జనవరి ఏడు వరకు పొడిగించింది. ప్రస్తుతం ఈ బ్యాంక్లో ఎల్ఐసి, కేంద్రానికి కలిపి 95 శాతం వాటా ఉంది. ఇందులోని 60.72 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం ఆసక్తిగా ఉంది. ఐడిబిఐ బ్యాంక్లో ప్రస్తుతం ఎల్ఐసికి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్ ప్రమోటర్ షేర్హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలున్నాయి. ఐడిబిఐ బ్యాంక్ను కొనుగోలు చేసే ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు పన్నులో రాయితీ ఇవ్వాలని మోడీ సర్కార్ భావిస్తోంది.










