Nov 19,2023 08:57

న్యూఢిల్లీ : మణిపూర్‌లో శాంతి చర్చలకు చొరవ తీసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉరుకేను రాష్ట్రానికి చెందిన పది ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. మణిపూర్‌లో మైతీలు, కుకీల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి, శాంతిని నెలకొల్పడానికి ఇరు గ్రూపులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ప్రధానిని కోరాయి. శాంతిభద్రతల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ హామీ ఇచ్చినట్లు రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి ఇబోబిసింగ్‌ నేతృత్వంలోని ఈ బృందంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ఆప్‌, జెడియు, ఎన్‌సిపి, ఫార్వార్డ్‌ బ్లాక్‌, శివసేన (ఉద్ధవ్‌), ఆర్‌ఎస్‌పి, టిఎంసి పార్టీల నాయకులు ఉన్నారు. ఆరు నెలలుగా అల్లర్లతో అతలాకుతలమవుతున్నా మణిపూర్‌లో కేంద్రం జోక్యం చేసుకోని సంగతి తెలిసిందే.