Jun 23,2023 21:30

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సెగ్మెంట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు కీలక కంపెనీల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.ఉదయం సెన్సెక్స్‌ 63,124.28 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,240.63- 62,874.12 మధ్య కదలాడింది. చివరకు 259.52 పాయింట్ల నష్టంతో 62,979.37 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,741.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,756.40- 18,647.10 మధ్య ట్రేడైంది. చివరకు 105.75 పాయింట్లు నష్టపోయి 18,665.50 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.03 దగ్గర నిలిచింది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టైటన్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.