Jan 26,2023 21:37

చెన్నయ్ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 102 శాతం వృద్థితో రూ.1,396 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.690 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ3లో ఈ బ్యాంక్‌ నికర నిరర్థక ఆస్తులు 1 శాతానికి తగ్గడం విశేషం. 2021-22 ఇదే త్రైమాసికంలో 2.7 శాతం ఎన్‌పిఎ చోటు చేసుకుంది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ)లో పెరుగుదల మెరుగైన ఆర్థిక ఫలితాలకు దోహదం చేసిందని ఇండియన్‌ బ్యాంక్‌ ఎండి, సిఇఒ ఎస్‌ఎల్‌ జైన్‌ పేర్కొన్నారు. వడ్డీయేతర ఆదాయం కూడా మద్దతునిచ్చిందన్నారు. క్రితం క్యూ3లో బ్యాంక్‌ ఎన్‌ఐఐ 25 శాతం పెరిగి రూ.5,499 కోట్లుగా చోటు చేసుకుంది.