Jun 21,2023 14:38
  • ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 31పరుగుల తేడాతో గెలుపు
  • ఎసిసి ఎమర్జింగ్‌ మహిళల ఆసియాకప్‌

హాంకాంగ్‌: ఎసిసి ఎమర్జింగ్‌ ఆసియాకప్‌ టైటిల్‌ను భారత(అండర్‌-23) మహిళలజట్టు కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత మహిళలజట్టు 31పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 127పరుగులే చేయగల్గింది. దినేశ్‌ వ్రిందా(36) టాప్‌ స్కోరర్‌. కనిక అహూజ(30) ఫర్వాలేదనిపించింది. ఛేదనలో బంగ్లాజట్టును స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌, మన్నత్‌ కశ్యప్‌ బౌలింగ్‌ మాయాజాలానికి 19.2ఓవర్లలో 96పరుగులకు కుప్పకూలింది. పాటిల్‌(4/13), కశ్యప్‌(3/20) బౌలింగ్‌లో మెరిసారు. వీరిద్దరూ 7వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. ఆఫ్‌ స్పిన్నర్‌ కనిక అహూజా(2/23) రాణించింది.

3

బంగ్లా బ్యాటర్‌ నహిదా అక్కర్‌(17నాటౌట్‌) టాప్‌స్కోరర్‌. మొత్తం 8జట్లు టైటిల్‌కై పోటీపడగా.. భారీ వర్షాల కారణంగా టోర్నమెంట్‌ 8 మ్యాచ్‌లు రద్దయ్యాయి. భారతజట్టు లీగ్‌ దశలో హాంకాంగ్‌పై 9వికెట్ల తేడాతో గెలుపొందగా.. శ్రీలంకతో జరగాల్సిన సెమీస్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మెరుగైన రన్‌రేట్‌తో భారత్‌ ఫైనల్‌కు చేరింది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టు లీగ్‌లో మలేషియాపై 97పరుగులతో, సెమీస్‌లో పాకిస్తాన్‌పై 6వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.