Jun 21,2023 16:55

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బుధవారం తాజా టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆరు నెలలుగా నంబర్‌ 1గా ఉన్న లబుషేన్‌ మూడో స్థానానికి పడిపోయాడు. 887 పాయింట్లతో జో రూట్‌ మొదటి స్థానం, 883 పాయింట్లతో కెన్‌ విలియమ్సన్‌ రెండో స్థానం, 877 పాయింట్లతో మూడో స్థానంలో మార్నస్‌ లబుషేన్‌, 873 పాయింట్లతో నాల్గో స్థానంలో ట్రవిస్‌ హెడ్‌, 862 పాయింట్లతో బాబర్‌ ఆజం ఐదో స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి యువ వికెట్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఒక్కడే 758 పాయింట్లతో టాప్‌-10లో కొనసాగుతున్నాడు. విరాట్‌ కోహ్లి ఒక స్థానం కోల్పోయి 14వ ర్యాంకుకు పడిపోగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ 802 పాయింట్లు, ఆసీస్‌ స్పిన్నర్ నాథన్ లైయన్ 799 ఒక్కో ర్యాంకును మెరుగుపర్చుకుని వరుసగా ఐదు, ఆరు స్థానాల్లోకి వచ్చారు. భారత ఆటగాడు రవీంద్ర జడేజా బౌలర్ల తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో అగ్రస్థానంలో జడేజా కొనసాగుతున్నాడు.