
- రైతుమిత్ర పేరిట ఆర్బికెల పని
- సచివాలయాల నుంచి కేటాయింపు
- అక్రమాలకు ఆస్కారం
- వాస్తవ రైతులకు నష్టం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : వ్యవసాయశాఖ చేపట్టిన పంట నమోదుల ప్రక్రియ (ఇ-క్రాప్ బుకింగ్)లో గ్రామ వలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. లబ్ధిదారుల ఇళ్లకు పథకాలను చేర్చేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టగా, ఆ వ్యవస్థను అధికార వైసిపి దుర్వినియోగం కావించి పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాల కు ఉపయోగపెట్టుకుంటోందన్న విమర్శలున్నాయి. ఈ తరుణంలో రైతుల అన్ని పథకాలకూ తప్పనిసరి చేసిన ఇ-క్రాప్ బుకింగ్కు వలంటీర్లను వినియోగించడం వివాదాస్పదం అవుతోంది. రెగ్యులర్ ఉద్యోగులైన రైతు భరోసా కేంద్రాల (ఆర్బికె) సిబ్బంది (వివిఎ/విహెచ్ఎ/ విఎస్ఎ) కాకుండా వారి కనుసన్నల్లో పనిచేసే వలంటీర్లతో ఇ-క్రాప్ చేయిస్తున్నట్లు సమాచారం. దాంతో చాలా చోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో బోగస్, అనర్హులైన రైతుల పేర్లు ఎక్కిస్తున్నారు. ఈ తంతుకు పలు జిల్లాల్లోని ఉన్నతాధికారుల ప్రోత్సాహమూ ఉంటోంది. ఇ-క్రాప్నకు సర్కారు విధించిన డెడ్లైన్ చేరాలంటే వలంటీర్ల అవసరం తప్పనిసరి అవుతోందని చెబుతున్నారు. నకిలీ రైతులు రికార్డుల్లో కక్కడంతో అనర్హులు ప్రభుత్వ లబ్ధిని కాజేస్తున్నారు. అర్హులు పథకాలు అందక నష్టపోతున్నారు. చివరికి తాము పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నిజమైన రైతులకు దాపురిస్తోంది.
ప్రత్యేక సేవా కార్యకర్తలు
ప్రభుత్వం ప్రతి సచివాలయ పరిధిలో నెలకొల్పిన ఆర్బికెల నిర్వహణకు (వివిఎ/విహెచ్ఎ/ విఎస్ఎ)లను శాశ్వత ప్రాతిపదికన నియమించింది. వీరు ఇ-క్రాప్, ఇతర ఫీల్డ్వర్క్లో ఉన్నప్పుడు ఆర్బికెలను నిర్వహించేందుకు గ్రామ సచివాలయ పరిధిలో పని చేసే వలంటీర్లలో ఒకరిని డిప్యూటేషన్పై ఆర్బికెలకు కేటాయిస్తూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎఒ, పంచాయతీ కార్యదర్శి, ఆర్బికె సహాయకుల సూచనల మేరకు ఎంపిడిఒ ఈ వలంటీర్లను వేయాలంది. పంటల సేకరణ సహా ఆర్బికెలలో పని చేసే వలంటీర్లకు 'రైతుమిత్ర'లుగా వ్యవహరించాలని స్వయాన ముఖ్యమంత్రే పేరు పెట్టారు. కొన్ని చోట్ల 'ఆర్బికె మిత్ర' అని కూడా పిలుస్తున్నారు. ఆర్బికెలలో పని చేసే వలంటీర్లు ఇంటర్ పాస్ కావడంతో పాటు జీవశాస్త్రం లేక బయాలజీ సబ్జెక్టు చదివి ఉండాలన్నారు.
సూపర్వైజరీ వారికే
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రివ్యూ మీటింగ్లో ఆర్బికెలకు కేటాయించిన వలంటీర్లు విధులకు హాజరు కావట్లేదని పలువురు డిఎఒలు ఫిర్యాదు చేసిన దరిమిలా, వలంటీర్ల పారితోషికానికి ఆర్బికె సహాయకుల డ్యూటీ/అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిబంధన విధించారు. దాంతో తప్పనిసరిగా వలంటీర్లు ఆర్బికె సహాయకులు చెప్పిన పని చేయాల్సి వస్తోంది. ఇ-క్రాప్ సాధన కోసం ఆర్బికె సిబ్బంది తమకు అప్పగించిన వలంటీర్లతో ఇ-క్రాప్ చేయిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. డేటా డౌన్లోడ్ చేసిన సిస్టమ్స్ను పాస్వర్డ్లు, లాగిన్ ఐడిలతో సహా వలంటీర్లకు ఇచ్చేస్తున్నారు. విఆర్ఒ, ఎ.ఒ., ఆపై అధికారులు సైతం సూపర్వైజరీ చెక్స్, తనిఖీలు, పరిశీలనల పనిని చాలా చోట్ల వలంటీర్లకే అప్పగిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ పంట నమోదులు నడుస్తున్నాయి. ఈ నెల 18 లోపు పూర్తి చేసి ఆర్బికెలలో ముసాయిదా జాబితాలు పెట్టాలని డెడ్లైన్ పెట్టారు. బోగస్, నకిలీ, అనర్హులు ఇ-క్రాప్లో ఎక్కితే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుందని, అసలైన రైతులు, కౌలు రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.