పరిమితంగా మూలధనం లభ్యత
ఎంఎస్ఎంఇలకు అడ్డంకులు
న్యూఢిల్లీ : దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) ప్రధానంగా సరుకు రవాణ, టెక్నలాజీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి పలు సంస్కరణలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణంకాల ప్రకారం.. దేశ జిడిపిలో ఎంఎస్ఎంఇలు 27 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ రంగంపై దాదాపు 11.1 కోట్ల మంది ఆధారపడ్డారు. ఎంఎస్ఎంఇ అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా ఆ రంగం సమస్యలపై బిజినెస్ స్టాండర్డ్ ఓ కథనం వెలువరించింది. దేశంలో ఎంఎస్ఎంఇలు ఎదుర్కొంటున్న రవాణ సవాళ్లు చాలా కాలంగా ఆ రంగం వృద్థికి అవరోధంగా ఉన్నాయి. కరోనా కాలంలో ఎంఎస్ఎంఇ రంగం తీవ్రంగా ప్రభావితమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎస్ఎంఇలకు మరో పెద్ద సవాలు ఇ-కామర్స్ పరిష్కారాలని అభిప్రాయపడుతున్నాయి.
''ఎంఎస్ఎంఇలకు మూలధనం, వనరుల లభ్యత పరిమితంగా ఉంది. ఈ రంగానికి వ్యయ సామర్థ్యం కీలకమైన అంశం. మార్కెట్ పోటీతత్వాన్ని బలోపేతం చేయడానికి, లాభదాయకతను పెంచడానికి చిన్న పరిశ్రమలు తమ థర్డ్ పార్టీ లాజిస్టిక్ పార్టనర్ల కార్యాచరణ సామర్థ్యంపై ఎక్కువగా ఆధారపడతాయి.'' అని గతి లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిరోజ్షా సర్కారీ పేర్కొన్నారు. క్లిష్టమైన సరఫరా చెయిన్ సిస్టం, సరైన గిడ్డంగులు లేక, రవాణా అవస్థాపనలు తరచుగా వ్యయ సామర్థ్యాన్ని సాధించడంలో ఆటంకం కలిగిస్తున్నాయని సిఎబిటి లాజిస్టిక్ ఫౌండర్ శైలేష్ కుమార్ తెలిపారు.
''టెక్నలజీలు, డేటా-ఆధారిత సాంకేతికతలు సరఫరా చెయిన్ నిర్వహణలో ఎక్కువ సామర్థ్యం, పారదర్శకతను తీసుకువచ్చాయి. ఈ డేటా అనలిటిక్స్ యుగంలో ఎంఎస్ఎంలు వృద్థి మార్కెట్లను గుర్తించడానికి, డెలివరీ పనితీరును అంచనా వేయడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాయి. సాంకేతిక మౌలిక సదుపాయాలు, సాఫ్ట్వేర్, నైౖపుణ్యం కలిగిన సిబ్బందిలో పెట్టుబడి పెట్టడం పరిమిత వనరులతో చిన్న వ్యాపారాలకు ఆర్థికంగా సవాలుగా ఉంది.'' అని శైలేష్ కుమార్ పేర్కొన్నారు.










