- నాణ్యత ప్రమాణాలపై హెచ్చరిక
న్యూఢిల్లీ : ఇ- కామర్స్ సంస్థలు విక్రయిస్తున్న బొమ్మల నాణ్యతపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నాణ్యత మార్క్ లేని బొమ్మలను విక్రయించినందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లకు నోటీసులు జారీ చేశామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) చీఫ్ నిధి ఖరే వెల్లడించారు. బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిపై దేశంలో పలు దుకాణాల్లో దాడులు నిర్వహించామని బిఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. గత నెలలో 44 చోట్ల నిర్వహించిన దాడుల్లో ప్రధాన రిటైల్ దుకాణాల నుండి 18,600 నాణ్యత లేని బొమ్మలను స్వాధీనం చేసుకున్నామన్నారు.










