Sep 13,2022 23:12

ప్రజాశక్తి-విజయవాడ
ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబరు 1వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌ అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం రక్తదాన శిబిరాల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌వో మాట్లాడుతూ ఈనెల 17 తేది నుండి అక్టోబర్‌ 1వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 4వేల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యాంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో 15 బ్లెడ్‌బ్యాంకులలోను, ఇంజనీరింగ్‌, వైద్య ఆరోగ్య, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులను రక్త దాన శిభిరాలలో పాల్గొనేలా కళాశాల ప్రిన్సిపల్స్‌ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 22 ప్రాంతాలలో రక్తదాన శిభిరాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈనెల 17, అక్టోబర్‌ 1వ తేదీన ఎక్కువ మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిభిరాలలో పాల్గొనేలా చూడాలన్నారు. నగరంతోపాటు జగ్గయ్యపేట తిరువూరు నందిగామ మైలవరం మున్సిపల్‌ పరిధిలో కూడా రక్త దాన శిభిరాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, పోలీస్‌, డిఆర్‌డిఏ తదితర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగస్థులు కూడా ప్రత్యేక రక్తదాన శిభిరాలలో పాల్గొనాలని డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌ కోరారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డా. జె ఉషారాణి, జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పి. కిరణ్‌, లైన్స్‌క్లబ్‌ డిస్టిక్‌ గవర్నర్‌ శ్రీ. శాంతి, సిద్ధార్థ , నిమ్రా మెడికల్‌ కళాశాల ప్రన్సిపల్స్‌, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.