కడప (వేంపల్లె) : మాజీ పార్లమెంటు సభ్యులు, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావును పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సన్మానించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఆదివారం వేంపల్లెలోని శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి ఇంటికి శోభనాద్రీశ్వరరావు వచ్చారు. ఈ నేపథ్యంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. సతీష్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి శోభనాద్రీశ్వరరావును, రైతు నాయకులు చంద్రారావును సన్నానించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అన్యాయం చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలను అమలు చేయడం సరైంది కాదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు రద్దు చేయాలని చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. సన్మాన కార్యక్రమంలో సతీష్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










