Feb 11,2023 21:33

ఫొటో : మాట్లాడుతున్న కోవూరు టిడిపి నియోజకవర్గ బాధ్యులు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

తీవ్ర సంక్షోభంలో ఆక్వారంగం
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : వైసిపి పాలనలో ఆక్వా రైతులకు అన్యాయం జరిగిందని కోవూరు టిడిపి నియోజకవర్గ బాధ్యులు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి విమర్శించారు. శనివారం మండలంలోని జగదేవిపేట గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మండల టిడిపి అధ్యక్షులు రావెళ్ల వీరేంద్రచౌదరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి శ్రేణులు దినేష్‌ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి దీవించారు. ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆక్వా రైతులు జోన్‌ విధాన లోపం కారణంగా కరెంట్‌ బిల్లులు అధికంగా రావడంతో గత్యంతరం లేని పరిస్థితులలో ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురైందన్నారు.
ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తేవడంలో స్థానిక శాసనసభ్యులు విఫలమైనారని తెలిపారు. ఆక్వారంగంపై ఆధారపడిన అనేక మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆక్వారంగాన్ని కాపాడాలని సూచించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో టిడిపి ఆధ్వర్యంలో రైతు ఉద్యమంపై పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, జిల్లా కార్యనిర్వాక కార్యదర్శి చెంచు కిషోర్‌ బాబు, అధికార ప్రతినిధి చేముకుల కృష్ణ చైతన్య, టిడిపి మండల ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్లురెడ్డి, సీనియర్‌ నాయకులు కొండూరు సుధాకర్‌ రెడ్డి, బొలినేని రవినాయుడు, బొల్లినేని హరి నాయుడు, మునగాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.