ప్రజాశక్తి-విశాఖ : తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ప్లాంటును పరిరక్షించుకోవడానికి కూడా ప్రజలే ముందుకు రావాలని సిపిఎం కోరింది. ఈ కర్తవ్య నిర్వహణలో ప్లాంట్ పరిరక్షణకు విస్తృతమైన ప్రజా మద్దతు కూడగట్టాలనే లక్ష్యంతో సిపిఎం ఉత్తరాంధ్ర మోటార్ సైకిల్ యాత్ర చేపట్టింది. ఇచ్చాపురం నుండి పాయకరావుపేట వరకు మైదాన, పట్టణ, గిరిజన ప్రాంతాల గుండా ఈ యాత్ర ఈనెల సెప్టెంబర్ 20 నుండి 29 వరకు పది రోజుల పాటు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదని, ఇంత ద్రోహానికి పాల్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, వారికి మద్దతిచ్చే పార్టీలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే హెచ్చరిక ఈ యాత్ర ద్వారా ఈ ప్రాంత ప్రజలు చేయాలి.










