ధర్మవరం టౌన్ : ధర్మవరం పట్టణంలో బుధవారం స్కూటిలో పెట్టిన రూ. లక్ష నగదును దొంగలు అపహరించారు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు... పట్టణంలోని బస్టాండ్ సమీపంలోనున్న హెచ్డిఎఫ్ బ్యాంకులో హౌసింగ్ లోను కట్టేందుకు లోనికోటకు చెందిన అమన్ అనే వ్యక్తి తన స్కూటీ డిక్కీలో రూ.లక్ష నగదు పెట్టుకుని బ్యాంకుకు వచ్చాడు. డబ్బు తీసుకోకుండా అమన్ బ్యాంకులోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన దొంగలు స్కూటీ డిక్కీని ఓపెన్ చేసి అందులోని రూ. లక్ష నగదును ఎత్తుకెళ్లారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో దొంగతనం చేసే వీడియో రికార్డు అయింది. బాధితుని ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం చేస్తున్నది మొత్తం బ్యాంకు కింద ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్ల షాపులోనున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఎంఆర్ఎఫ్ టైర్ల షాపులోని సీసీ కెమెరా పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు.










