Oct 24,2023 09:42

ఢిల్లీ: వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త మృతి చెందారు. వాఘ్ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్ (49) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆదివారం ఆయన మరణించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్‌ 15న మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన ఆయనపై వీధి కుక్కలు దాడి చేయడం వల్ల పరాగ్‌ దేశాయ్ కిందపడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీధి కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌లోని జైదాన్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. పరాగ్‌ దేశాయ్ మృతి పట్ల వాఘ్ బక్రీ టీ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.