Oct 02,2023 22:15

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : హోంవర్క్‌ చేయలేదని పలకతో టీచర్‌ కొట్టడంతో విద్యార్థి ప్రాణం విడిచాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు, రాధ దంపతులు రామంతాపూర్‌ వివేక నగర్‌లో నివసిస్తున్నారు. వారి కుమారుడు హేమంత్‌ (4) స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్లో యుకెజి చదువుతున్నాడు. శనివారం హోంవర్క్‌ చేయలేదని హేమంత్‌ తలపై పలకతో టీచర్‌ బలంగా కొట్టింది. దాంతో హేమంత్‌ తలకు తీవ్రగాయమై ఒక్కసారిగా కుప్పకూలాడు. తల్లిదండ్రులకు స్కూల్‌ సిబ్బంది సమాచారం ఇచ్చి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలుడు సోమవారం మృతిచెందాడు. దాంతో టీచర్‌, స్కూల్‌ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యం నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.