Mar 24,2023 21:06

- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ గిరీష స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, సూపర్‌వైజర్లను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్‌) అన్ని ప్రాజెక్టుల సిడిపిఒలు, సూపర్‌ వైజర్‌ లతో కలెక్టర్‌ గిరీషా పిఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లలో 3 నుంచి 5 సంవత్సరాలలోపు గుర్తించిన పోషక, సూక్ష్మ పోషక లోపాలున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి దశలవారీగా ఎదుగుదల తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బరువు, ఎత్తు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచడంతోపాటు సరైన పోషకాహారాన్ని అందించి వయసుకు తగ్గ రీతిలో బరువు, ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రోత్‌ మానిటరింగ్‌ రిజిస్టర్‌లో బరువు, ఎత్తు కొలతలను నమోదు చేయడంతో పాటు సూపర్వైజర్లు అంగన్వాడీ సెంటర్లను పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీ స్త్రీలకు, చంటి పిల్లలకు పోషకాహార పదార్థాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిడిపిఒలను ఆదేశించారు. రక్తహీనతతో ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, బాలింతలకు వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లు సక్రమంగా పంపిణీ చేసి అధిగమించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లలు, గర్భిణీలు సంపూర్ణ పోషణ కింద ఇస్తున్న పౌష్ఠికాహారం తీసుకున్న తర్వాత వెంటనే ఏరోజుకారోజు డేటా ఎంట్రీ చేయాలన్నారు. జిల్లాలో రక్త హీనతతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గాలని స్పష్టం చేశారు. ఇందులో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆరు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లల ఆధార్‌ అప్‌ డేట్‌ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు అప్పుడే బ్రెయిన్‌ డెవలప్మెంట్‌ అవుతూ ఉంటుందని వారి మీద ప్రత్యేక దష్టి పెట్టి అక్షరాలు దిద్దించాలని సూచించారు. ఐసిడిఎస్‌ పరిధిలో కోర్ట్‌ కేసులు ఏమైనా ఉంటే వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని చెప్పారు. సమీక్షలో ఐసిడిఎస్‌ పిడి ధనలక్ష్మి, అన్ని ప్రాజెక్టుల సిడిపిఒలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.