ప్రజాశక్తి-అమరావతి : గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్యాయత్నం కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 11కి హైకోర్టు వాయిదా వేసింది. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు ఫ్లెక్సీ వార్ నడిచింది. ఈ ఫ్లెక్సీల వివాదంలో యార్లగడ్డ వెంకట్రావుతో పాటుగా పలువురు టీడీపీ శ్రేణులపై వీరవల్లి పోలీసు స్టేషన్ లో పలు కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావుతోపాటు 47 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మూడు కేసుల్లో యార్లగడ్డ వెంకట్రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఇకపోతే ఈ కేసులో ఇప్పటికే పలువురికి ముందస్తు బెయిల్ మంజూరు అయింది.










