Aug 17,2022 23:37

ప్రజాశక్తి-నందిగామ: నందిగామలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఉచితంగా మోడల్‌ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబిషనరీ పూర్తయిన సందర్భంగా సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత మంచి చేకూరేలా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ జయరాం, ఎఇ ఫణి శ్రీనివాసరావు, సిఐ కనకరావు, తహశీల్ధార్‌ నరసింహారావు పాల్గొన్నారు.
సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన
మండలంలోని రాఘవాపురం గ్రామంలో రూ.40 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువచేయడంతో పాటు, పాలనను ప్రజల ఇంటి ముందుకే తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు.