Nov 09,2023 22:24

ప్రజాశక్తి-పెద్దాపురం
పట్టణ పరిధిలోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న నల్ల బూడిద వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నందున, ఈ సమస్య పరిష్కారానికి పెద్దాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. గురువారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో జరిగిన సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా ప్రజలు ఈ సమస్యతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రజా ఉద్యమాల ఫలితంగా అధికారులు కంటి తుడుపు చర్యలు తీసుకోవటం తప్ప శాశ్వత పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. ఇటీవల కాలంలో మళ్ళీ ఈ సమస్య పునరావృతమై తీవ్రతరం అయ్యిందన్నారు. ఈ నల్ల బూడిద కళ్ళల్లో పడి ప్రజలు కంటి జబ్బులతో ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. రహదారిలో వాహనాలపై వెళ్లే వారి కళ్ళల్లో ఈ బూడిద పడి తీవ్ర అవస్థలకు గురవుతు న్నారన్నారు. మున్సిపల్‌ ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, కేదారి నాగు తదితరులు పాల్గొన్నారు.