Nov 11,2023 11:14

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్‌ సరస్సులోని హౌస్‌బోట్స్‌లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బంగ్లాదేశ్‌కి చెందిన ముగ్గురు పర్యాటకులు మరణించారు. ఈ ఘటనలో ఐదు హౌస్‌బోట్స్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున దాల్‌ సరస్సులోని ఘాట్‌ నెంబర్‌ 9 సమీపంలోని హౌస్‌బోట్‌లో మంటలు చెలరేగాయని అన్నారు. ఈ మంటలు ఇతర బోట్‌లకు వ్యాపించాయని అన్నారు. సఫీనా హౌస్‌బోట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన పర్యాటకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హౌస్‌బోట్‌లు బూడిదగా మారిన కొన్ని గంటల తర్వాత మృతదేహాలు గుర్తించామని అన్నారు. ఈ ఘటనలో ఐదు బోట్‌లు పూర్తిగా ధ్వంసం కాగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.