Feb 14,2023 22:06

నిరసనలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి హిందూపురం : మను సంస్కృతి విధానంతో దేశానికి ముప్పు ఏర్పడుతుందని కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ అన్నారు. మతోన్మాద శక్తులైన ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌ బుధవారం హైదరాబాదు నగరంలో మను సంస్కృతి గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తూ కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి మను సంస్కృతి విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మను సంస్కృతి గ్రంథాన్ని ఆవిష్కరించడం ఈ దేశంలో ఉన్నా దళితులు, పేదలు, ఉద్యోగ, ఉపాధ్యాయులందరిని అవమానపరచడమేనని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగదళ్‌ సంస్థలను వెంటనే రద్దుచేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బిఎస్‌పి శ్రీరాములు, మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అగౌరపరిచిన్ణ బిజెపి అనుబంధ సంఘాలను దళితులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ మండల కార్యదర్శి మధు, అధ్యక్షులు నారాయణప్ప, అంజనప్ప, చర్లపల్లి నరసింహప్ప, మండల అధ్యక్షులు తిమ్మయ్య, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.