విజయనగరం : మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం గజపతుల కుటుంబంలో వివాదాన్ని ఇంకా రాజేస్తోంది. తాజాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై మాజీ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ట్విట్టర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. 'ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈవోని బెదిరించేందుకు సిబ్బందిని ప్రేరేపించడం సిగ్గుచేటు. మీ అన్నయ్య ఆనంద గజపతి రాజు జయంతి రోజున ఇలాంటి చర్యలకు పాల్పడటానికి మీకు సిగ్గుగా లేదా?' సిబ్బందిని తప్పుదోవ పట్టించి, వారిని రెచ్చగొట్టి ఈవో మీదికి పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వాడుకోవద్దు.' అంటూ అశోక్ గజపతి రాజును ప్రస్తావిస్తూ సంచయిత ట్వీట్ చేశారు. కాగా, తమకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలంటూ శనివారం మాన్సాస్ కార్యాలయాన్ని ట్రస్ట్ ఉద్యోగులు ముట్టడించిన సంగతి తెలిసిందే. మాన్సాస్ ఈవో వెంకటేశ్వరరావును దాదాపు రెండు గంటలుగా నిర్బంధించారు.










