ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలోని పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం సీనియర్ నాయకులు ఈరన్న, పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు గోపాల్, తిప్పన్న, కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోని ఆర్ట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ హాలులో జరిగిన 'జగనన్నకు చెబుదాం, స్పందన'లో జెసి నారపురెడ్డి మౌర్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంలో రోడ్లు వెడల్పు చేయాలని, అన్ని వీధుల్లోనూ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని కోరారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలని, బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. టెక్స్ టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆదోని ప్రభుత్వాస్పత్రి, స్త్రీలు, చిన్నపిల్లల ఆస్పత్రిని జిల్లాస్థాయిగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. 300 పడకలకు పెంచి, అన్ని రకాల జబ్బులకు వైద్యులను నియమించి, మెరుగైన వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో సిటి స్కానింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని, పట్టణంలో అదనంగా మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో చెత్త పన్ను రద్దు చేయాలని, విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను తగ్గించాలని కోరారు. పట్టణంలో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని తెలిపారు.
వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు