- నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కరోనా వైరస్ (కోవిడ్ - 19) కారణంగా మరణించిన వారి వారసులకు రూ.50 వేలు ఎక్స్గ్రేషియా (నష్టపరిహారం) చెల్లించడానికి ఆన్లైన్ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా, సులభంగా నష్టపరిహారం అందజేసేందుకు కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు సమన్వయంతో వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొబైల్తోపాటు కంప్యూటర్లోనూ ఆన్లైన్ పోర్టల్లో నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. బాధితులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్లో నష్టరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం బాధితులు మృతునికి కోవిడ్ నిర్థారించిన ఆర్టిపిసిఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్ రిపోర్టులలో ఏదొక డాక్యుమెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది.
ఎపిలో 14,478 మరణాలు
ఎపిలో ఇప్పటి వరకు కోవిడ్ వల్ల 14,478 మంది మరణించినట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్లో తెలిపింది. నెల రోజులలో 55 కొత్త మరణాలు సంభించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటలలో31,855 శ్యాంపిల్స్ను పరీక్షించగా, కొత్తతగా 137 మందికి కోవిడ్ సోకినట్లు తెలిపింది. కరోనా నుంచి 189 మంది కోలుకోగా, 1,705 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.











