Dec 20,2021 09:04
  • క్రీడాకారుల నుంచి ఫీజు వసూలు
  • చీఫ్‌ కోచ్‌లకు శాప్‌ ఉన్నతాధికారుల ఆదేశాలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 'మీరు కోచ్‌లేనా.. అయితే స్టేడియాలలో ఆడుకునేందుకు వచ్చే క్రీడాకారుల నుంచి అడ్మిషన్‌సహా ఫీజులు వసూలు చేయండి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులకూ మినహాయింపు లేదు. ప్లేయర్స్‌ డబ్బు చెల్లించలేకపోతే, వారి తరపున మీరే స్పాన్సర్లను పట్టుకుని డబ్బులు తీసుకోండి. ఏం చేస్తారో, ఏమో తెలియదు. ప్రతి జిల్లా నుంచి ఏడాదికి కనీసం రూ.కోటి ఇవ్వాల్సిందే..' ఇదీ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) ఉన్నతాధికారుల నుంచి జిల్లాల్లోని చీఫ్‌ కోచ్‌లు, జిల్లాల యువజన సర్వీసుల శాఖ సిఇఓలకు ఆదేశాలు వస్తున్నాయి. జిల్లాల్లోని స్టేడియాలలో కొద్ది రోజులుగా పీజుల అంశం పై చర్చలు జరుగుతు న్నాయి. పాఠశాలలు, కాలేజీలలో చదువుకునే విద్యార్థులను కూడా స్టేడియాలకు వచ్చి ఆడుకునేలా చేసి, వారి నుంచి ఫీజులు వసూలు చేయాలంటూ శాప్‌ ప్రొసీడింగ్స్‌ను జారీ చేసింది. ఈ విషయంపై శాప్‌లో ఇటీవల ఒక ఉన్నతస్థాయి సమావేశం కూడా జరిగింది. గతంలోనే ఉన్న పే అండ్‌ ప్లే స్కీంను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆ సమావేశంలో పలువురు చీఫ్‌ కోచ్‌లు ఫీజులు వసూలు చేయడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్రీడాకారులు కట్టలేకపోతే, కోచ్‌లు, చీఫ్‌ కోచ్‌లే స్పాన్సర్లను పట్టుకోమని శాప్‌ సీనియర్‌ అధికారి ఒకరు సలహా ఇచ్చినట్లు తెలిసింది. స్విమ్మింగ్‌, టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ వంటి ఖరీదైన క్రీడలకు 24 గంటలూ కోచింగ్‌ ఇవ్వాలని, ఇంటెరెస్ట్‌గా ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వండంటూ ఆదేశిం చారు. స్టేడియాలలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేసినా సరే ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దని ఆదేశించినట్లు తెలిసింది.
 

                                            డబ్బుల్లేవు..కలెక్ట్‌ చేయండి

కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, ఖో - ఖో వంటి క్రీడలు ఆడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. స్కూల్స్‌, కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్లు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లే మంచి ప్లేయర్స్‌ను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇపుడు వారి నుంచి నెల, మూడు నెలలు, ఏడాదిపాటు ఫీజులు వసూలు చేయమని ఆదేశించడంతో ఏం చేయాలో పాలుపోవడంలేదని పలువురు కోచ్‌లు వాపోతున్నారు. 14 ఏళ్లలోపు క్రీడాకారులకు వెయ్యి వరకు అడ్మిషన్‌ ఫీజు, కనీసం రూ.15 నుంచి 400 వరకు నెలవారీ ఫీజు, 14 ఏళ్లు పైబడిన వారికి రూ.16 వేల వరకు అడ్మిషన్‌ ఫీజు, రూ.40 నుంచి రూ.3 వేల వరకు నెలవారీ ఫీజులు వసూలు వసూలు చేసేలా ప్రొసీడింగ్స్‌ వచ్చినట్లు తెలిసింది. అయితే, వీటిని ఇంత వరకు బహిర్గతం చేయలేదు.
 

                                                   కోచ్‌లు లేకపోయినా..

జిల్లాల్లో చాలా క్రీడాంశాలకు కోచ్‌లు లేరు, 13 జిల్లాల్లో శాప్‌ క్రికెట్‌ కోచ్‌ ఒక్కరే ఉండగా, స్విమ్మింగ్‌ కోచ్‌లు ఐదుగురే ఉన్నారు. టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌ కోచ్‌లూ తక్కువే. కబడ్డీ, వాలీబాల్‌, హాకీ, ఆర్చరీ, బాక్సింగ్‌ కోచ్‌ల కొరత ఉంది. క్రీడా సంఘాలే చాలా వరకు సొంతంగా శిక్షణ ఇచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రీడల బాధ్యతల నుంచి ప్రభుత్వం వైదొలగాలనే ఉద్దేశంతోనే క్రీడాకారుల నుంచి ఫీజులు వసూలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోచ్‌లు లేని స్పోర్ట్స్‌కు ఫీజులు ఎలా వసూలు చేయాలని, ఏడాదికి ఒక్కో జిల్లా నుంచి రూ.కోటి ఎలా వసూలు చేయాలోనని చీఫ్‌ కోచ్‌లు తర్జననభర్జనలు పడుతున్నారు. చాలా స్టేడియాలలో సౌకర్యాలే లేవు. అలాంటపుడు ఫీజుల వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.