బెంగళూరు : నవంబర్లో రిటైల్ వాహనాల విక్రయాలు 26 శాతం పెరిగాయి. ప్రయాణికుల, వాణిజ్య, ద్విచక్ర ఇలా అన్ని విభాగాల్లోనూ గత నెలలో విక్రయాలు భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో నవంబర్లో వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఎడిఎ) పేర్కొంది. నవంబర్లో త్రీ వీలర్స్ అమ్మకాలు అత్యధికంగా 80 శాతం పెరగ్గా, ట్రాక్టర్ సేల్స్ 56.8 శాతంగా ఉన్నాయని తెలిపింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 32.8 శాతం పెరిగాయి. ద్విచక్రవాహనాలు మరియు ప్యాసింజర్ వాహనాల్లో అతి తక్కువ లాభాలు వరుసగా 23.6 శాతం, 21.3 శాతంగా ఉన్నాయి.
ఆర్థిక వృద్ధిని లెక్కించడంలో 50 శాతం కంటే అధిక వెయిటేజీని కలిగి ఉన్నందున భారత్లోని ప్రైవేట్ వినియోగాన్ని అంచనా వేయడానికి ఆటో అమ్మకాలు కీలక సూచీల్లో ఒకటి. టూవీలర్ సేల్స్ వాస్తవానికి నవంబర్ 2019 కరోనాకు పూర్వం కంటే స్వల్పంగా 0.9 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వాహనాలు 5.1 శాతంతోపాటు ఇతర విభాగాల్లోని అన్ని వాహనాల విక్రయాలు పెరిగాయి. 2019తో పోలిస్తే రిటైల్ వాహనాల అమ్మకాలు 1.5 శాతం పెరిగాయి.










