Mar 18,2023 20:11

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ప్రకాష్‌

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
విద్యా విధానాన్ని సక్రమంగా అందించాలి
పాఠశాల తనిఖీలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌
ప్రజాశక్తి-రాయచోటి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యా విధానాన్ని విద్యార్థులకు విద్య సక్రమంగా అందించాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, కో-ఆపరేటివ్‌ కాలనీలోని మండల పరిషత్‌ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రాయచోటిలోని నేతాజీ సర్కిల్‌ వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించి పనులు ఆలస్యంగా చేస్తుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాయచోటిలోన జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి నేరుగా నాలుగో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఆయన పాఠ్యాంశంలోని కొన్ని ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సమాధానం రాబట్టారు. సిలబస్‌ పూర్తికాకుండా ఫార్మేటివ్‌ 4 పరీక్షను విద్యార్థులు ఎలా రాస్తారని, సిలబస్‌ పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. క్లాస్‌ టీచర్‌ విద్యార్థులకు సకాలంలో విద్యాబోధన పూర్తి చేశారా లేదా విషయాన్ని హెచ్‌ఎం, ఎంఇఒ, డిప్యూటీ డిఇఒ ఎందుకు పర్యవేక్షణ చేయలేదని మండిపడ్డారు. విద్యార్థులను ఉపాధ్యాయులు సొంత బిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎం, ఎంఇఒ, డిప్యూటీ డిఇఒలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. రూ.కోట్లు ఖర్చుపెట్టి వర్క్‌ బుక్స్‌ అందిస్తే వినియోగించరా? ఉపాధ్యాయుకు బాధ్యత లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస్కరణలు ప్రభుత్వం తీసుకువస్తోందని పేర్కొన్నారు. విద్యకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నారు, ఉపాధ్యాయులు కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రాయచోటి కో-ఆపరేటివ్‌ కాలనీలోని మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నిల్వ ఉంచిన కోడిగుడ్లు, చిక్కిల్లో క్వాలిటీ, ఎక్స్పైరీ డేట్‌లను పరిశీలించారు. విద్యార్థులకు కోడిగుడ్లను సకాలంలో అందించకపోవడం గమనించడంతో ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ప్రతివారం మధ్యాహ్నం జగనన్న గోరుముద్దను పరిశీలించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, తీరు తెన్నులు పరిశీలించి స్వయంగా విద్యార్థికి గోరుముద్దను తినిపించి రుచి చూశారు. ఈ తనిఖీలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, డిఇఒ పురుషోత్తం, డిప్యూటీ డిఇఒ వరలక్ష్మి, ఎంఇఒ రమాదేవి, తహశీల్దార్‌ ప్రేమంత్‌ కుమార్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.