Mar 28,2023 21:28

కాల్పుల్లో మృతిచెందిన దిలీప్‌కుమార్‌, గాయపడిన మహబూబ్‌బాష

పులివెందుల టౌన్‌ : వైఎస్సార్‌ జిల్లా, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో మంగళవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన తుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన చింతకుంట దిలీప్‌కుమార్‌(24)ను కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. రాగిపాటి మహబూబ్‌ బాషా అలియాస్‌ మస్తాన్‌ పులిy ెందులలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్‌పి అన్బు రాజన్‌ కథనం మేరకు వివరాలిలా... భరత్‌ కుమార్‌ యాదవ్‌, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌కుమార్‌ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతుండేవారు. దిలీప్‌, భరత్‌కుమార్‌ యాదవ్‌కు అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో మధ్యాహ్నం ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. అక్కడి నుంచి హుటాహుటిన తన ఇంట్లోకి వెళ్లిన భరత్‌కుమార్‌ యాదవ్‌ తనవద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దిలీప్‌ ఛాతిపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలోనే అతడి పక్కనే ఉన్న దిలీప్‌ స్నేహితుడు మహబూబ్‌ బాషా అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతడిపైనా కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు. గాయాలతో వీరిద్దరూ ఆలయం మెట్ల వద్ద కింద పడిపోవడంతో భరత్‌కుమార్‌ యాదవ్‌ అక్కడి నుంచి తుపాకీతో పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితులను చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దిలీప్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా భరత్‌ కుమార్‌ యాదవ్‌ తుపాకీతో సహా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
వివేకా కేసులో భరత్‌ను విచారించిన సిబిఐ
మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో పలుమార్లు సిబిఐ అధికారులు భరత్‌ కుమార్‌ యాదవ్‌ను విచారించారు. పలుమార్లు పత్రికా సమావేశం సమావేశాలు నిర్వహించి సిబిఐ అధికారులు, వివేకా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్‌ గన్‌ పొందినట్లు తెలుస్తోంది. వివేకా కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ కుమార్‌ యాదవ్‌కు భరత్‌ కుమార్‌ యాదవ్‌ స్వయాన సోదరుడు కావడం గమన్హాం.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌పి
పట్టణంలో కాల్పుల ఘటన తెలుసుకున్న ఎస్‌పి అన్బురాజన్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన తీరును, సంఘటనకు గల కారణాలను పులిy ెందుల డిఎస్‌పి శ్రీనివాస్‌ను అడిగి తెలుసు కున్నారు. ఆయనతోపాటు పిఆర్‌ డిఎస్‌పి రమ ణయ్య రిస్క్‌ టీం ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి భారీగా పోలీసులు మోహరించారు. పట్టణ సిఐ రాజు, రూరల్‌ సిఐ మద్దిలేటి, ఎస్‌ఐలు చిరంజీవి, మల్లికార్జున్‌రెడ్డి కూడా ఎస్‌పి వెంట ఉన్నారు.