Aug 21,2022 22:11

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: మానవులంతా ఐక్యతతోనే ఉండాలని, చట్టాలు అందరికీ సమానత్వంగా ఉండాలని పలువురు వక్తలు అన్నారు. ముస్లిం అడ్వికేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మొగల్‌రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో చట్టాలకు సంబంధించిన సమీక్షా సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రదాన వక్తగా పాల్గొన్న ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు జనరల్‌ సెక్రటరీ ఖాలీద్‌ సైఫుల్లా రహ్మాని మాట్లాడుతూ ప్రపంచ మానవులందరూ దైవం దృష్టిలో సమానులన్నారు. ముస్లిం పర్సనల్‌ లాకు సంబంధించి అనేక అపోహలు సృష్టిస్తున్నారని వాటిని తొలగించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు ఖురాన్‌ సర్వమానవాళి కొరకు అవతరించిందని ఈగ్రంథం సర్వ మానవ సమానత్వం, మానవత్వం బోధించిందన్నారు. ప్రత్యేక అతిధిగా పాల్గొన్న అఖిల భారత మిల్లీ కౌన్సిల్‌ సహాయ ప్రదాన కార్యదర్శి షా ఖాద్రీ సయ్యద్‌ ముస్తఫా రిఫారు జిలానీ మాట్లాడుతూ ఖురాన్‌ సర్వ మానవాళి కొరకు అవతరించిందన్నారు. ఈగ్రంథం సర్వ మానవ సమానత్వం మానవత్వం బోధించిందని అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సోదరభావంతో మెలగాలన్నారు. ఈకార్యక్రమంలో ముస్లిం అడ్వికేట్‌ అసోషియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జవహర్‌ అలి, జనరల్‌ సెక్రటరీ అబ్ధుల్‌, ట్రెజరర్‌ ఇక్భాల్‌ అలి, ఆలిండియా మిల్లీ కౌన్సిల్‌ కృష్ణాజిల్లా కార్యదర్శి షేక్‌ మునీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.