ప్రజాశక్తి-రాయచోటి : గ్రామాలలో రీ సర్వే పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హద్దు రాళ్లు నాటే ప్రక్రియ, గ్రౌండ్ ట్రూతింగ్, డ్రోన్ ఫ్లయింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడిని ఆదేశించారు. అంతకు ముందు విజయవాడ నుంచి విసి ద్వారా సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ మాట్లాడారు. గ్రామాల్లో రీ సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల తనిఖీ, గ్రౌండ్ ట్రూతింగ్, ఫైనల్ ఆర్ఒఆర్, డ్రోన్ ఫ్లయింగ్ తదితర ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. నిర్దేశించిన గడువులోగా గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. హద్దురాళ్లు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. డ్రోన్ ఏరియల్ ఫ్లయింగ్ సకాలంలో పూర్తి చేయాలన్నారు. బౌండరీ కన్ఫర్మేషన్, ఏరియా వ్యాలీడేషన్, సర్వే కంప్లిషన్, ఫైనల్ రెవెన్యూ రికార్డు నిర్దేశించిన గడువులోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఫైనల్ ఆర్ ఓఆర్, 13 నోటిఫికేషన్ తదితర ప్రక్రియలన్నీ కూడా పురోగతి కనిపించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డిఆర్ఒ సత్యనారాయణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఎడి జయరాజ్ పాల్గొన్నారు.










